వాస్తవం ప్రతినిధి: ఈ ఏడాది మెగా ఐపీఎల్ టోర్నీలో సన్రైజర్స్ హైదరాబాద్ సారథిగా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ వ్యవహరించనున్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా సారధిగా ఉన్న డేవిడ్ వార్నర్ బుధవారం ఆ భాద్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వార్నర్ స్థానంలో విలియమ్సన్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని సన్రైజర్స్ సీఈవో కె.షణ్ముగం ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు అని షణ్ముగం తన ట్విట్టర్ ఖాతా లో పేర్కొన్నాడు. దీనిపై విలియమ్సన్ మాట్లాడుతూ..‘ఈ ఏడాది ఐపీఎల్ సన్రైజర్స్కు నాయకత్వ బాధ్యతలు స్వీకరించాను. ఎంతో ప్రతిభ ఉన్న జట్టుకు నాయకత్వం వహించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని తెలిపాడు. అయితే తొలుత ఈ సారధి భాద్యతల కోసం టీమిండియా క్రికెటర శిఖర్ ధావన్ పేరు వినిపించినప్పటికీ ఇప్పటి వరకు కెప్టెన్సీ అనుభవం లేని ఒక్క కారణంగా ధావన్ పేరు ను ఆ రేసు నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. దీనితో విలియమ్సన్ ఆ భాద్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్-2018 సీజన్లో కెప్టెన్గా వ్యవహరిస్తోన్న ఏకైక విదేశీ ఆటగాడు విలియమ్సన్ కావడం విశేషం.